వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై జిల్లాలోని స్ఫూర్తిదాయక విజయగాధల తయారీపై చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలు, వ్యవసాయం (పాడి పరిశ్రమ, ప్రకృతి సేద్యం), ప్రభుత్వ సేవలు వంటి విజయం సాధించిన గాథలను తయారు చేసి కృష్ణాస్ఫూర్తి పేరుతో ప్రతిరోజు వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సూచిస్తూ, అవి ఇతరులకు స్ఫూర్తినిస్తాయని ఆ దిశగా కృషి చేయాలన్నారు. వారు ఆయా రంగంలో విజయవంతం అవ్వడానికి సహకరించిన అంశాలను వివరిస్తూ, ఇతరులు కూడా అదే స్ఫూర్తితో ఎదగవచ్చని, అందుకు ప్రభుత్వ పరంగా అందించే సహకారాన్ని, వనరులను తెలియపరుస్తూ ఆసక్తి గలవారు సంప్రదించవలసిన సంప్రదింపు వివరాలను ఆ కథలో పొందుపరచాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా మహిళల వ్యాపారాలు, పాడి పరిశ్రమ, వ్యక్తిగత వ్యాపారాలు తదితర రంగాలలో విజయగాధలను గుర్తించాలని సూచించారు. దీనికి గృహ నిర్మాణ సంస్థ పిడి విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు.
సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యాన శాఖల అధికారులు చిన్న నరసింహులు, అయ్యా నాగరాజా, జె జ్యోతి, డ్వామా, డిఆర్డిఏ పీడీలు ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, హరిహరనాథ్, ఏపీ ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, ఎల్డిఎం రవీంద్రారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.